"ప్రజా జీవితంలో పారదర్శకత" తిరుమలాయపాలెంలో రగులుతున్న చర్చ"
సైకిల్ పై సామాన్య వ్యక్తిగా సీడ్స్ వ్యాపారం.
ప్రజా సమస్యలపై పోరాడుతానని పార్టీని ఉద్దరిస్తారని పార్టీలో చేరిక!!
కట్ చేస్తే..
ఖమ్మంలో కోట్లల్లో విలాసవంతమైన భవనాలు..
తిరుమలాయపాలెం, జూన్ 1 ఖమ్మం వాణి ప్రతినిధి:
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ప్రజా ప్రతినిధుల ఆదాయ వనరులు, ఆస్తుల పెరుగుదలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రజల కష్టాల కోసం పుట్టామని చెప్పుకునే పార్టీల్లోని కొందరు నేతలు దొరలకు, అధికారులకు ఊడిగం చేస్తూ కోట్లకు పడగలెత్తారనే విమర్శలు మారుమోగుతున్నాయి. పార్టీలో మండల స్థాయి పీఠాలు ఎక్కిన కొందరి తీరుపై సొంత కార్యకర్తలకే అనుమానాలు ముసురుకుంటున్నాయి. పార్టీని గుండెల్లో పెట్టుకుని పనిచేయాల్సిన వాళ్ళే పార్టీ పునాదులకు గొడ్డలి పెట్టుగా మారారని, ఉద్యోగస్తులతో కుమ్మక్కై సాగిస్తున్న అక్రమ లావాదేవీలను బట్టబయలు చేయాలని పార్టీలోని నిజాయితీపరులే గుసగుసలాడుతున్నారు.
చొక్కా లేకుండా తిరిగిన నాయకులు కళ్ళు చెదిరే భవనాలు ఎలా కట్టారని ఊరూవాడా చర్చ నడుస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో కందికి కుటుంబాలు చిట్టీల పేరుతో దోపిడీకి గురవుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పార్టీ జెండా కప్పుకుని, పార్టీ పనులకు తెచ్చిన ఇసుక, సిమెంటు, ఇటుక, ఐరన్ ను కొందరు సొంత మేడలకు మళ్లించుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలు, క్వారీలు, అధికారుల ఆఫీసుల్లో పార్టీ పేరు చెప్పుకుని రెండు ఖాతాలు నడుపుతూ, అడ్డదారిలో కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి ఆస్తుల, అప్పుల చిట్టా బయటపెట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాత ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకు కొండంత తేడా ఉంటే పార్టీ పెద్దలు తమ వాళ్ళ అంతు చూడాలని కోరుతున్నారు. పార్టీ కోసం చెమటోడ్చిన నిబద్ధత కలిగిన కార్యకర్తలకే పదవుల పీఠం వేయాలని శ్రేణులు నినదిస్తున్నాయి. జవాబుదారీతనం లేకపోతే ప్రజాస్వామ్యం బతకదని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Comments
Post a Comment